పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం/
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం
కర్ణాటక సంగీతం - సర్టిఫికేట్
గాత్రం/ వీణ/ వయోలిన్/ గోటు/ వేణువు/ నాదస్వరం/ క్లారినెట్
మొదటి సంవత్సరం - సిద్ధాంతం
పారిభాషిక పదములు
1.శృతి:
స్వరారంభకావయవ ధ్వనివిశేషము “శృతి” అనబడును. శ్రవణేంద్రియములకు వినబడునట్టి ధ్వనివిశేషము “శృతి” అని చెప్పబడును.
“शृयन्ति इति शृतयः”
అట్టి శృతివలన
షడ్జము,
రిషభము,
గాంధారము,
మధ్యమము,
పంచమము,
దైవతము,
నిషాదము అను సప్తస్వరములు పుట్టాయి.
శృతికి నాదము ప్రధానం. ఈ నాదము అతితక్కువ ధ్వనినుండి అతి హెచ్చు ధ్వనివరకు ఒకదానికొకటి హెచ్చుగాను, విడివిడిగాను విభజిస్తే, వచ్చే ధ్వనులు 66 మాత్రమే. వీటినే “శృతులు” అంటారు.
ఇవి మనిషిలోని హృదయ కంఠ శిరస్సులనే త్రిస్థానములనుండి క్రమముగా వెడలునపుడు
హృదయస్థానమందు ఏర్పడు మొదటి 22 శృతులను “మంద్రశృతుల”నియు
కంఠస్థానమందు ఏర్పడు రెండవ 22 శృతులను “మధ్యమశృతుల”నియు
శిరస్సు స్థానమందు ఏర్పడు మూడవ 22 శృతులను “తారశృతుల”నియు
చెప్పబడును.
పైన చెప్పిన ఒకొక్క భాగమునందుగల 22 శృతులనే పూర్వాచార్యులు “ద్వావింశతి శృతుల”ని చెప్పుచున్నారు.
మొట్టమొదటగా ఈ 22 శృతులగురించి ప్రస్తావించినవారిలో ఒకరు భరతముని. ఆయన నాట్యశాస్త్రమందు ఇలా ప్రస్తావించారు.
చతుశ్చతుశ్చతుశ్చైవ షడ్జమధ్యమపంచమాః ।
ద్వేద్వేనిషాద గాంధారౌ త్రిస్త్రిర్షిభదైవతౌ ॥
चतुश्चतुश्चतुश्चैव षड्जमध्यमपंचमाः ।
द्वेद्वेनिषाद गान्धारौ त्रिस्त्रिर्षिभदैवतौ ॥
ఒక స్థాయిలోని స్వరాల్లో, వరుసగా ఏర్పడే శృతుల సంఖ్య:
4 + 3 + 2 + 4 + 4 + 3 + 2 = 22 శృతులు అన్నమాట.
ఆధార శృతి: ఏ శృతిలో అయితే మంద్రస్థాయి మధ్యమం నుండి తారస్థాయి పంచమం వరకు సులువుగా పాడగలుగుతున్నామో, దానిని మనకి ఆధారశృతిగా ఎంచుకోవాలి.
2. స్వరం:
స్వకీయముగా రంజింపజేయు ధ్వనివిశేషమును “స్వరము” అని అంటారు.
శృతులు విడివిడిగాను, వ్యక్తముగాను పలుకవు. కనుక, వినదగినవిగాను, ఇంపుగా ఉండునట్టుగాను పూర్వాచార్యులు శృతులను పంచి, రంజకమైన అక్షరాలతో చేర్చారు.
సంగీతరత్నాకరము అనే గ్రంథములో శార్ఙ్గదేవుడు
“స్వతో రంజయతి శ్రోతృచిత్తమ్ సస్వరముచ్చతే”
అని పేర్కొన్నారు.
స్వతః = తనంతట తానుగా
రంజయతి = రంజింపజేసేది
వినేవారి మనసుకి ఆహ్లాదం కలిగించే ధ్వనిని “స్వరము” అంటారు.
ఇలా రంజకమైన అక్షరాలతో శృతిచేర్చి పలికేదే “స్వరము” అనబడును.
స్వరాలు ఏడు. అవి:
షడ్జము (నెమలి స్వరం)
రిషభము (ఎద్దు స్వరం)
గాంధారము (మేక స్వరం)
మధ్యమము (క్రౌంచపక్షి స్వరం)
పంచమము (కోయిల స్వరం)
దైవతము (గుఱ్ఱం స్వరం)
నిషాదము (ఏనుగు స్వరం)
వీటికే “సప్తస్వరములు” అని పేరు. ఈ సప్తస్వరములకు తారషడ్జమును చేర్చినచో ఏర్పడు స,రి, గ,మ,ప,ద,ని,స అను 8 స్వరములకు “స్వరాష్టకము” అని పేరు.
3. పూర్వాంగము: సప్తస్వర సంకేతములగు స,రి,గ,మ,ప,ద,ని లోని మొదటి భాగమైన ‘స,రి,గ,మ’ ను “పూర్వాంగము” అని చెప్పుదురు. దీనినే English లో “Lower Tetrachord” అందురు.
4. ఉత్తరాంగము: సప్తస్వర సంకేతములగు స,రి,గ,మ,ప,ద,ని లోని రెండవ భాగమైన ‘ప,ద,ని’ ని “ఉత్తరాంగము” అని చెప్పుదురు. దీనినే English లో “Upper Tetrachord” అందురు.
స్వరములకైనా, కీర్తనలకైనా, వర్ణాలకైనా, తాళానికైనా, రాగం-తానం-పల్లవులకైనా, దేనికైనా సరే, మొదటి సగభాగాన్ని “పూర్వాంగం” అని, రెండవ సగభాగాన్ని “ఉత్తరాంగం” అని పిలుస్తారు.
5. ద్వాదశ స్వరములు:
సప్తస్వరములలో షడ్జపంచమములు (స,ప) ప్రకృతిస్వరములు (ఒకేచోట ఉంటాయి కనుక “అచల స్వరాలు”).
ఇవి తప్ప మిగిలిన ఐదు స్వరములు వికృతి స్వరములు (ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో ఉంటాయి కనుక “చల స్వరాలు”). అవి రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాదములు.
శుద్ధవికృతి భేదములుండుటచే ఏర్పడు 12 స్వరములను “ద్వాదశ స్వరములు” అందురు. అవి:
షడ్జము
శుద్ధ రిషభము
చతుశృతి రిషభము
సాధారణ గాంధారము
అంతర గాంధారము
శుద్ధ మధ్యమము
ప్రతి మధ్యమము
పంచమము
శుద్ధ దైవతము
చతుశృతి దైవతము
కైశికి నిషాదము
కాకలి నిషాదము
ఈ 12 స్వరస్థానములను వీణ మొదలగు వాయిద్యములందు గమనించిన, స్పష్టముగా తెలియును.
6. షోడశ స్వరములు:
కర్ణాటక సంగీతంలో కటపయాది సూత్రం ప్రకారం రాగాల విభజన చేయటంకోసం 16 స్వరస్థానాలు వాడుకలో ఉన్నాయి.
ద్వాదశ స్వరస్థానములలో
శతుశృతి రిషభ స్థానమునందు శుద్ధ గాంధారము
(రి2 = గ1)
సాధారణ గాంధార స్థానమునందు షట్శృతి రిషభము
(రి3 = గ2)
చతుశృతి దైవత స్థానమునందు శుద్ధ నిషాదము
(ద2 = ని1)
కైశిక నిషాద స్థానమునందు షట్శృతి దైవతము
(ద3 = ని2)
పలుకుచుండుటచే, మొత్తము 12 + 4 = 16 స్వరములగుచున్నవి. ఇవియే “షోడశ స్వరములు” అని చెప్పబడును.
ఈ జతల్లోని స్వరాలకు ఒకటే ధ్వని ఉంటుంది కనుక, ఏ రాగంలోనూ ఏచోటా రెండూ కలిసి ఉండవు.
షోడశ స్వరములు:
షడ్జము
శుద్ధ రిషభము
చతుశృతి రిషభము
షట్శృతి రిషభము
శుద్ధ గాంధారము
సాధారణ గాంధారము
అంతర గాంధారము
శుద్ధ మధ్యమము
ప్రతి మధ్యమము
పంచమము
శుద్ధ దైవతము
చతుశృతి దైవతము
షట్శృతి దైవతము
శుద్ధ నిషాదము
కైశికి నిషాదము
కాకలి నిషాదము
7. శుద్ధ స్వరములు: షోడశ స్వరములలో నియమితములైన శృతులతో కూడుకొనిన స్వరములను “శుద్ధ స్వరములు” అందురు. అవి
షడ్జము
శుద్ధ రిషభము
శుద్ధ గాంధారము
శుద్ధ మధ్యమము
పంచమము
శుద్ధ దైవతము
శుద్ధ నిషాదము
ఈ 7 స్వరములకు వేంకటమఖి 1స, 2ర, 3గ, 4మ, 5ప, 6ద, 7న అను సంకేతములను ప్రత్యేకముగా ఏర్పరిచిరి.
వీటికి “వేంకటమఖి శుద్ధ స్వర సంకేతములు” అని పేరు.
8. వికృత స్వరములు: షోడశ స్వరములలో నియమితములగు హెచ్చుతగ్గులుగల శృతులతో కూడుకొనిన స్వరములను “వికృత స్వరములు” అందురు. అవి
చతుశృతి రిషభము
షట్శృతి రిషభము
సాధారణ గాంధారము
అంతర గాంధారము
ప్రతి మధ్యమము
చతుశృతి దైవతము
షట్శృతి దైవతము
కైశిక నిషాదము
కాకలి నిషాదము
ఈ 9 వికృత స్వరములకు వేంకటమఖి రి, రు, గి, గు, మి, ది, దు, ని, ను అను సంకేతములను ప్రత్యేకముగా ఏర్పరిచిరి.
వీటిని “వేంకటమఖి వికృత స్వర సంకేతములు” అని అందురు.
9. కోమల స్వరములు: ద్వాదశ స్వరములనబడు 12 స్వరములలో
శుద్ధ రిషభము
సాధారణ గాంధారము
శుద్ధ దైవతము
శుద్ధ మధ్యమము
కైశిక నిషాదము
వీటిని “కోమల స్వరములు” అందురు.
10. తీవ్ర స్వరములు: ద్వాదశ స్వరములనబడు 12 స్వరములలో
చతుశృతి రిషభము
అంతర గాంధారము
ప్రతి మధ్యమము
చతుశృతి దైవతము
కాకలి నిషాదము
వీటిని “తీవ్ర స్వరములు” అందురు.
ఈ కోమల, తీవ్ర స్వరములు అను పేర్లను ముఖ్యముగా హిందుస్తానీ సంగీతమునందు వాడుదురు.
11. అల్పత్వ స్వరము: ఏదైనా ఒక రాగములో ఒక స్వరము అరుదుగా ప్రయోగింపబడినచో, అట్టి స్వరమును “అల్పత్వ స్వరము” అందురు.
ఉదా: శ్రీరాగంలో అవరోహణ సంచారములో
“పదని” అను విశేష సంచారము. అందుగల “ద” అను చతుశృతి దైవతము స్వరము అరుదుగా ప్రయోగింపబడును. కనుక, “ద” అనునది అల్పత్వ స్వరమని చెప్పబడును.
12. బహుత్వ స్వరము: ఏదైనా ఒక రాగములో ఒక స్వరము విశేషముగా ప్రయోగింపబడినచో, అట్టి స్వరము “బహుత్వ స్వరము” అని చెప్పబడును.
ఉదా: కానడ రాగంలో అవరోహణ సంచారములో
సాధారణ గాంధారము బహు పర్యాయములు ప్రయోగింపబడును.
కనుక ఈ రాగంలో సాధారణ గాంధారము బహుత్వ స్వరము అని చెప్పబడును.
13. దుర్బల స్వరము: ఏదైనా ఒక రాగములో ఒక స్వరము దుర్బలముగా (తేలికగా) పలుకబడుచున్నచో, అట్టి స్వరమును “దుర్బల స్వరము” అందురు.
ఉదా: ఆరభి రాగంలో అవరోహణ సంచారములో
“మగరిసరి” అను సంచారమునందు పలుకు అంతర గాంధారము
చాలా దుర్బలముగా పలుకుచుందుము. కనుక ఈ రాగంలో అంతర గాంధారము దుర్బల స్వరము అని చెప్పబడును.
14. ఆరోహణము: ఏదైనా ఒక స్వరమును అనుసరించి, తక్కిన స్వరములు హెచ్చు ధ్వనిలో పోవుటను “ఆరోహణము” అందురు.
ఉదా: సరిగమపదనిస
15. అవరోహణము: ఏదైనా ఒక స్వరమును అనుసరించి, తక్కిన స్వరములు తగ్గు ధ్వనిలో పోవుటను “అవరోహణము” అందురు.
ఉదా: సనిదపమగరిస
16. ధాతువు: రచనలోని స్వరభాగమును “ధాతువు” అని చెప్పుదురు.
ఉదా: మపదససరి
17. మాతువు: రచనలోని సాహిత్యభాగమును “మాతువు” అని చెప్పుదురు.
ఉదా: శ్రీ.గణనాథ
18. ఆవృత్తము: తాళముయొక్క సంపూర్తికి “ఆవృత్తము” అని పేరు. అనగా, ఒక పూర్తి కాలప్రమాణము. ఒక తాళంలోగల అంగములన్నియూ ఒకసారి పూర్తిగా వేయుటకు పట్టు కాలము.
ఉదా: ఆదితాళము:
దీనికిగల అంగములు - ఒక లఘువు, రెండు ధృతములు.
ఈ మూడింటిలో 8 అక్షరములను వేయుటకు పట్టు కాలము
19. స్థాయి: ద్వాదశ స్వరస్థానములు లేక షోడశ స్వరస్థానములుగల ఒక భాగమునకు స్థాయి అని పేరు. అనగా షడ్జమునుండి ఆరోహణ క్రమమున దానికి పైనగల నిషాదము వరకు స్థాయి అని పేరు. దీనికే English లో “Octave” అని పేరు.
20. త్రిస్థాయి: స్థాయి ముఖ్యముగా మూడు విధములుగా ఉన్నది.
మంద్రస్థాయి
మధ్యమస్థాయి
తారస్థాయి
కర్ణాటక సంగీతంలోగల సుప్రసిద్ధ రచనలన్నియు ఈ త్రిస్థాయిలందే రచింపబడుటవలన, గాత్రసంగీతము ఈ త్రిస్థాయిలందు మాత్రమే పాడుటకు సాధ్యమగుటచేత, ముఖ్యంగా ఈ త్రిస్థాయిలు మాత్రమే వాడుకలో ఉండుట జరిగినది.
21. పంచస్థాయిలు: త్రిస్థాయిల్లో మంద్రస్థాయికి దిగువగానుండు స్థాయిని “అనుమంద్ర స్థాయి” అని, తారస్థాయికి పైన ఉండు స్థాయిని “అతితారస్థాయి” అని అందురు. త్రిస్థాయిలలో ఐ రెండు స్థాయిలను కలిపిన పంచస్ధాయిలగును.
22. మంద్రస్థాయి: మధ్యస్థాయికి దిగువనుండు స్థాయిని “మంద్రస్థాయి” అందురు. ఈ స్థాయిలోని స్వరములకింద చుక్క ఉండును.
ఉదా: నిదపమ
23. మధ్యస్థాయి: మంద్ర, తార స్థాయిలకు మధ్యనుండు స్థాయిని “మధ్యస్థాయి” అందురు. ఈ స్థాయిలోని స్వరములకు చుక్కలు ఉండవు.
ఉదా: సరిగమపదని
24. తారస్థాయి: మంద్ర, మధ్య స్థాయిలకంటే హెచ్చుస్థాయిని “తారస్థాయి” అందురు. ఈ స్థాయిలోని స్వరములకు పైన చుక్క ఉండును.
ఉదా: సరిగమప
25. ద్విగుణత్వము: మధ్యస్థాయి షడ్జమునకు తారస్థాయి షడ్జమునకు గల ధ్వని తారతమ్యమును “ద్విగుణత్వము” అందురు.
26. ప్రథమ కాలము: ఒక అక్షరకాలములో ఒక స్వరము పాడినచో దానిని “ప్రథమ కాలము” అందురు. ఈ ప్రథమ కాలములోని స్వరములకు గీతలు ఉండవు. దీనినే “విళంబ కాలము” అందురు.
27. ద్వితీయ కాలము: ప్రథమ కాలములో ఒక అక్షరకాలమునకు ఎన్ని అక్షరములు పాడబడునో, అదే లయ ప్రమాణమునకు రెట్టింపు అక్షరములను పాడుటను “ద్వితీయ కాలము” అందురు. ద్వితీయ కాలములోని స్వరములకు క్రింద ఒక గీత ఉండును. దీనినే మధ్యమ కాలము అందురు.
28. తృతీయ కాలము: ద్వితీయ కాలములో ఒక అక్షరకాలమునకు ఎన్ని అక్షరములు పాడబడునో, అదే లయ ప్రమాణమునకు రెట్టింపు అక్షరములను పాడుటను “తృతీయ కాలము” అందురు. దీనినే “దురిత కాలము” లేక “ధృత కాలము” అందురు. ఈ కాలములోని స్వరములకింద రెండు గీతలు ఉండును.
29. అక్షరకాలము: ఏదైనా ఒక జాతిని అనుసరించి, వేళ్ళను, ఘాతాలను, విసర్జితములను వానివాని క్రమములలో ప్రదర్శించుటను “అక్షర కాలము” అందురు. తాళమును ప్రదర్శించినపుడు వానిలో ఎన్ని ప్రత్యేకమైన నడకలు ఉండునో, ఆ నడకల మొత్తమునకు “అక్షర కాలము” అని పేరు.
30. భరతము: భావ, రాగ, తాళములు మూడింటియొక్క ప్రథమాక్షర సంయోగములను “భరతము” అందురు.
31. తౌర్యత్రికము: నృత్యము, గీతము, వాయిద్యము - ఈ మూడింటియొక్క సమ్మేళనమును “తౌర్యత్రికము” అందురు.
32. సంగీతము:
“గీత, వాయిద్యముల చేరిక సంగీతము” అని కొందరు, “రాగస్వరతాళముల చేరికయే సంగీతము” అని కొందరు చెప్పియున్నారు.
ఈ విధమైన సంగీతమునకు నాదం ప్రధానం. అట్టి నాదమువలన శృతులు, అట్టి శృతులవలన షడ్జమాది స్వరములు, ఆ స్వరములవలన రాగములు, గీతములు కలుగుటచే గీతము నాదస్వరూపమని, వాద్యము గీతముననుసరించునదిగా ఉండునని చెప్తారు.
సంగీతం సామవేదంనుండి బ్రహ్మచే గ్రహించబడి, లోకోద్ధారణ కారణమై భరతాదులచేతను, తదుపరి వాగ్గేయకారులచేతను వెల్లడి చేయబడిన శాస్త్రమైనది కనుక, సంగీత విద్య మహనీయులచేత సహితం కొనియాడబడుచున్నది.
మానవులు తమ మేధాశక్తిచే విశ్వజన రంజకముగా కృతులను గానముచేయ, గాత్రమునందుగానీ, వాద్యమునందుగానీ ప్రదర్శింపబడునది “సంగీతము”.
భక్తితో చేయు గానము యోగమై, ఆ యోగముచేత మానవులు పరమాత్మయందు ఐక్యమగుదురని స్పష్టమైనందున, అందులకు భక్తియుతమైన సంగీతోపాసన తరణోపాయ మార్గమైనది.
33. సప్త స్వరముల పుట్టుక:
నెమలి కూత షడ్జముగాను
వృషభధ్వని రిషభముగాను
మేషశబ్దము గాంధారముగాను
క్రౌంచపక్షి పలుకులు మధ్యమముగాను
వసంతఋతువునందలి కోకిల కూత పంచమముగాను
గుర్రపు సకిలింపు దైవతముగాను
ఏనుగు ఘీంకారము నిషాదముగాను
పుట్టినట్టు తెలియుచున్నది.
34. మేళము: జనకరాగము లేక మేళకర్త రాగమునకుగల మరియొక పేరు. ఇట్టి మేళకర్త రాగములు కర్ణాటక సంగీతమునందు 72 కలవు. మేళకర్త రాగములనగా, సంపూర్ణమైన ఆరోహణ, అవరోహణములు కలిగి, కొన్ని జన్యరాగములు కలిగినవి. వీటినే “ఆధార రాగములు” లేదా “Fundamental ragas” అందురు.
35. నాదము:
మనిషి శరీరంలోని యోగాధారములు ఆరింటిలోను మొదటిదైన మూలాధార స్థానమునందుగల చతుర్దశ దళ చక్రమునకు “బ్రహ్మగ్రంథి” అని పేరు.
ఈ బ్రహ్మగ్రంథిలోనుండి సూక్ష్మాగ్నిచే ప్రేరేపించబడిన ప్రాణవాయువు
నాభి,
హృదయ,
కంఠ,
శిరస్సు,
ముఖముల ద్వారా బయటకు వెడలునపుడు నాదము ఉత్పత్తి అగుచున్నది.
ఇట్లు ఏర్పడిన నాదము
నాభియందు ఉన్నప్పుడు “అతిసూక్ష్మము” అనియు,
హృదయమునందు ఉన్నప్పుడు “సూక్ష్మము” అనియు,
కంఠమునందు ఉన్నప్పుడు “పుష్ఠము” అనియు,
శిరస్సునందు ఉన్నప్పుడు “అపుష్ఠము” అనియు,
ముఖమునందు ఉన్నప్పుడు “కృత్రిమము” అనియు
చెప్పబడుచున్నది.
నాదము అనగా, సంగీతధ్వని లేక సంగీత పరికరము (వాద్యము) యొక్క స్వరము.
నాదము అను రెండు అక్షరములలో ‘నకారము’ ప్రాణమని, ‘దకారము’ అగ్ని అనియు చెప్పుదురు. కావున, అట్టి ప్రాణాగ్నుల సంయోగమువలన ఏర్పడు ధ్వని నాదము.
ఈ నాదము రెండు విధములుగా విభజించబడినది. అవి:
ఆహత నాదము: ఇది భవభంజకమైనదిగాను, గానోత్పత్తికారిగాను ఉండి శృతి, స్వర, గ్రామ, మూర్ఛనాదులద్వారా జనరంజకమును కలుగజేయునది అవును.
అనాహత నాదము: ఇది రంజకము లేనిదై, గురుముఖముగా ఉద్దేశింపబడినదై, ముక్తిప్రదమై, అచంచల మనోరథముగల మునులచే ఉపాసించబడినది.
పైన తెలిపిన మూలాధారజనితమైన ఈ నాదము వేదములకు ఆధారస్థానములగుటయే కాక, పద, వాక్య, కావ్య, నాటక, అలంకార శాస్త్రములను, శృతి, స్వర, గ్రామ, మూర్ఛన, అలంకార, గీత, వర్ణ, పద, కీర్తనాదులు ఏర్పడుటకు కారణమై, జనరంజకమైన సంగీతముగా ఏర్పడుచున్నది.
36. తాళము:
సంగీత కాలమును తెలుసుకొనుటకు ఉపయోగించు కొలతను “తాళము” అంటారు.
ఉభయ హస్తములయొక్క సంయోగ వియోగముల వలన వ్యాపించిన దశప్రాణములయొక్క కాలమునకు “తాళము” అని పేరు.
శంకరుడు ఆదిదేవతగా గల ‘త’కారము, శక్తి ఆదిదేవతగా గల ‘ళ’కారము చేరి “తాళము” పుట్టెను. అనగా, శివశక్తుల సంయోగమే తాళము అగుచున్నది.
సంగీతమును గాత్రమున గానీ, జంతమున గానీ ప్రదర్శించినప్పుడు, ఆ పాటలయొక్క కాలప్రమాణమును చేతివేళ్ళను ఎంచుటవలన గానీ, తాళయంత్రములను ఉపయోగించుట వలన గానీ, తెలుసుకొను కొలతకు ‘తాళము’ అని పేరు.
ఈ తాళములు 7, 35, 175 రకములుగా వ్యవహరించుట కలదు.
సంగీత ప్రపంచమునకు సప్తస్వరములు ఎట్లు పునాదియో, అట్లే తాళ లోకమునకు సప్తతాళములు పునాది. అవి:
ధృవతాళము ।0॥
మఠ్యతాళము ।0।
రూపకతాళము 0।
ఝంపెతాళము ।U0
త్రిపుటతాళము ।00
అటతాళము ॥00
ఏకతాళము ।
తాళమునకు 6 అంగములు ఉన్నవి. వాటికే “షడంగములు” అని పేరు.
అనుధృతము
ధృతము
లఘువు
గురువు
ప్లుతము
కాకపాదము
ఈ 6 అంగములలో మొదటి మూడు అంగములు మాత్రమే ఈ కాలమున వాడుకలో ఉన్నవి.
సప్తతాళములలో లఘువు చాలా ముఖ్యమైన అంగము. ఇది అన్ని తాళములలోను ఉండును.
అనుధృతము ఝంపెతాళములో మాత్రమే ఉండును.
ధృతము ఏకతాళములో తప్ప, మిగిలిన అన్ని తాళములలోను ఉండును.
ఈ లఘువు అను అంగమునకు చతురశ్ర, త్రిశ్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ అను 5 జాతులతో సంబంధము కలుగుటవలన 35 తాళములు ఏర్పడుచున్నవి.
ఈ 35 తాళములు చతుశ్రాది పంచగతి భేదమునొందినపుడు
35 * 5 = 175 తాళములు అగుచున్నవి.
పురంధరదాసు - జీవిత చరిత్ర
పురందరదాసు 1486 - 1564 కాలంనాటివారు. ఈయన 1486వ సంవత్సరంలో బళ్ళారి జిల్లాలో హంపి వద్ద పురందరగడ అనే గ్రామంలో జన్మించిరి. కర్ణాటక బ్రాహ్మణుడు, మధ్వ మతస్తుడు. తండ్రి వరదప్ప, తల్లి కమలాంబ.
పురందరదాసు భార్య పేరు సరస్వతీబాయి. ఈయన మొదట పూనా నగరంలోను, తరువాత హంపి, విజయనగరంలోను నివసించినారు.
అన్నమాచార్యునికన్నా చిన్నవారు. వీరు ఉభయులూ సమావేశమైనట్టు కూడా చెప్పుదురు.
ఇతడు పండరీనాథుని భక్తుడై తన ఆస్తినంతయు దానధర్మములకు ఉపయోగించిన గొప్ప త్యాగఘనుడు.
వేదోపనిషత్తులను ప్రజలకు బోధించిన చరితార్థుడు.
కన్నడ భాషలో విశేష పాండిత్యం సంపాదించి భక్తితో 4,75,000 దేవరనామములను రచించి, తరించిన మహానుభావుడు.
కర్ణాటక సంగీతము ప్రారంభ శిక్షణకు వీలుగా స్వరావళి, జంట, అలంకార, పిళ్ళారిగీతములను రచించెను.
ఆదిగురువు మరియు సూళాదులను ఠాయములవంటి ప్రబంధములను రచించిన మేధాసంపన్నుడు.
వేదాంత ప్రబోధములైన ఇతని రచనలను కన్నడభాషలో దాసరపదగళు అని చెప్పుదురు.
వీరి రచనలు “పురంధరవిఠల” ముద్రను కలిగియుండును.
స్వరావళిని మాయామాళవగౌళ రాగములో బోధించుట ఇతడే ప్రారంభించెను.
ఇతనికి “కర్ణాటక సంగీత పితామహ” అని బిరుదు కలదు. ఇతని కుటుంబంలోని వారందరూ సంకీర్తన రచయితలగుదురు.
కథ: ఇతడు తల్లిదండ్రులయొక్క ఏకైక పుత్రుడు. తిరుపతి వేంకటేశ్వరుని మొక్కుపై జన్మించెను. వీరు చాలా ధనవంతులు అయినందువల్ల వరదప్పను “నాయక్” అని పిలిచేవారు. వేంకటేశ్వరుని అనుగ్రహంవల్ల జన్మించారు కాబట్టి ఇతనికి శ్రీనివాసుడు అని పేరు పెట్టిరి.
శ్రీనివాసుడు చిన్నతనంలోనే సంస్కృతం, కన్నడ భాషల్లోను, సంగీతం మొదలైనవాటిలో మేటి అయిరి. వజ్రములు పరీక్షించుటలో కూడా ప్రావీణ్యము సంపాదించిరి. ఇతనికి సరస్వతీబాయి అను బాలికతో 16వ ఏట వివాహం జరిగినది. ఇతని 20వ ఏట తల్లిదండ్రులు కరువైరి కనుక వ్యాపారభారమంతయు ఇతనిపై పడినది. అతిచతురతతో వ్యాపారం చేసి, ధనమును బాగుగా గడించిరి. వీరి సహవ్యాపారస్తులు వీరిని “నవకేటి నారాయణ” అని పిలిచేవారు. కానీ లోభత్వం కూడా వీరిలో పెరిగెను.
ఒకనాడు శ్రీనివాసుని వద్దకు ఒక బ్రాహ్మణుడు తన కుమారునికి ఉపనయనం చేయవలయుననియు, అందులకు కొంత సహాయము చేయవలయుననిను అర్థించెను. శ్రీనివాసుడు రేపు రమ్మని చెప్పెను. ఇట్లు కొన్ని దినములు బ్రాహ్మణుడు వచ్చుటయు, ఇదే బదులు చెప్పుటయు జరిగెను. ఆ బ్రాహ్మణుడు విసిగి, శ్రీనివాసుని భార్య అయిన సరస్వతీబాయి వద్దకు వెళ్లి సహాయం చేయమని కోరెను. ఆమె మిక్కిలి భక్తి కలిగినది, నిష్ఠాపరురాలు. ఉపనయనం కొరకు వచ్చి సహాయం అడిగిన కాదనకూడదని తెలిసి, వెంటనే తన ముక్కున ఉన్న ముంగెరును తీసిచ్చి దానిని అమ్మి ఖర్చు చేసుకోమనెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు దానిని తీసుకొని శ్రీనివాసుని వద్దకు అమ్ముటకై వెళ్ళెను. ఆ నగను చూసిన వెంటనే అది తన భార్యదే అని గుర్తించెను. వెంటనే తన ఇంటికి వెళ్లి భార్య ముంగెరను అడిగెను. సరస్వతీబాయి భయపడి, బ్రతుకుటకంటే చావు మేలని విషము కలుపుకొని తాగబోయెను. కానీ ఆ పాత్రలో తన ముంగెర కనబడగా దానిని తీసుకొనిపోయి దానిని తన భర్తకు ఇచ్చెను. ఆ నగను చూసి శ్రీనివాసుడు ఆశ్చర్యపోయి తన భార్యవలన జరిగిన విషయము వినిన వెంటనే అతనికి జ్ఞానోదయము కలిగెను. వెంటనే ఆ బ్రాహ్మణుడికోసం వెతికించగా అతను కానరాలేదు. ఆ బ్రాహ్మణుడే పరమపురుషుడగు విఠలస్వామి అని తెలుసుకొని తన సర్వస్వము దానధర్మములకు వినియోగించెను. ఆ సమయములో అఠాణ రాగంలో మొదటి కీర్తన రచించిరి.
జ్ఞానోదయం అయినప్పటినుండి ఇతడు దేశములోని అన్ని క్షేత్రములను దర్శించెను. ప్రసిద్ధ మధ్వగురువు అయిన వ్యాసతీర్థులవారు వీరికి ఉపదేశము చేసి “పురంధరదాసు” అని పేరు పెట్టిరి. ఈ భార్యాభర్తల భక్తికి మెచ్చి పురంధర విఠలుడు చాలాసార్లు దర్శనమిచ్చిరి.
వీరు నారదాంశము అని ప్రతీతి. శ్రీ త్యాగయ్యగారు వీరికి చాలా కృతులలో అంజలి ఘటించిరి. మధ్యమకాల రచనలలో నాయికానాయకుల భావములతో కొన్ని రచనలు వీరిచే రచింపబడినవి. వీరు గీతములను, ద్విధాతు ప్రబంధములను రచించిరి. వీరు హంపిలో నివసించిన మఠమునకు “పురంధరదాసు మఠము” అని పేరు. ఆ మఠము ఇప్పటికీ హంపిలో కలదు. ఈయన చివరి దశలో సన్యాసమును స్వీకరించిరి. రక్తాక్షి నామ సంవత్సరము పుష్య బహుళ అమావాస్య అనగా 1564 జనవరి 2వ తేదీన సిద్ధిపొందిరి.
పైడాల గురుమూర్తిశాస్త్రి - జీవిత చరిత్ర
పైడాల గురుమూర్తిశాస్త్రి 18వ శతాబ్దమునకు చెందినవాడు. నివాసము తిరునల్వేలి జిల్లా కయత్తారు అను గ్రామము. రామస్వామి దీక్షితులకు సమకాలీకుడు. తెలుగు ములికినాటి బ్రాహ్మణుడు. చతుశ్శాస్త్ర పండితుడు. సంగీతసాహిత్యములందు అతిసమర్థుడు. గీత, లక్షణగీత, ప్రబంధ, కీర్తనలు అనేకము రచించిన మహానుభావుడు. సుమారు వెయ్యి గీతములవరకు రచించియుండుటచే ఈయనకు “వేయి గీత” అను సార్థకనామము వచ్చినది. తన రచనలయందు గురుమూర్తి అను స్వనామ ముద్రను ఉపయోగించినాడు. తనకుగల సంగీత సాహిత్య విశిష్టతచే మణలి చిన్నయ మొదలియార్ చే మద్రాసునందు బహు సన్మానములొందినారు.
సంస్కృతములో ఈయన రచించిన
ధన్యాసిరాగములోని “నీరజనయన”
మోహనరాగములోని “సదాపతిం” వంటి కీర్తనలు,
శహన రాగములోని “కంసాసుర” వంటి లక్షణగీతములు
మిగుల ప్రసిద్ధములు.
జతిస్వరము/ స్వరపల్లవి
ఇది శబ్దమువలె నృత్యమునకు ఉపయోగకరమగు ఒక రకమైన సంగీత రచన. దీనిలోని సంగీతము జీవము కలదిగాను, ఆకర్షణీయముగాను ఉండును. సంగీత అమరికలోను, నిర్మాణములోను స్వరజతిని పోలియుండును. పల్లవి, అనుపల్లవి, చరణం అను అంగములను కలిగియుండును. కానీ వీటికి సాహిత్యము ఉండదు. దీని నడక సాధారణముగా తానవర్ణమును పోలియుండును. మధ్యమకాలములో ఉండును. కొన్ని జతిస్వరములకు అనుపల్లవి ఉండదు. గీతములను నేర్చిన తర్వాత స్వరపల్లవి నేర్చుకుందురు.
ఈ స్వరపల్లవినే జతిస్వరము అందురు. సాధారణముగా జతిస్వరమును అభ్యాసగాన రచనగా చెప్పుటకంటె నృత్యప్రదర్శన రచనగా చెప్పుట సమంజసము. సంగీత క్రమశిక్షణా పద్ధతిలో విద్యార్థులకు జతిస్వరము నేర్పించకపోయినప్పటికీ, నృత్యప్రదర్శనలో విధిగా నేర్పుదురు.
జతిస్వరము మొదటినుండి చివరివరకు స్వరములుగానే పాడబడుచున్నది. సాహిత్యము ఉండదు. పలువిధ ప్రస్తార క్రమములను ప్రదర్శించుటకొరకు పల్లవి, అనుపల్లవి, చరణములతో ఉండును. స్వరభాగములను తిరిగి పాడుటచే, స్వరపల్లవి అనే పేరు వచ్చినది. కొన్ని జతిస్వరములలో కొంత స్వరముగాను, మరికొంత భాగము తాళముల జతులను కలిపి రచించుట పరిపాటి. కొన్ని రాగమాలికా జతిస్వరములు కూడా కలవు. చరణములు వేరువేరు ధాతువులలో ఉండును. స్వాతితిరునాళ్ రాగమాలికా జతిస్వరములను పెక్కు రచించిరి. జతిస్వరము రచయితలలో పొన్నయ్యపిళ్ళై, వడివేలు పిళ్ళై, శివానందం పిళ్ళై మొదలైనవారు ప్రసిద్ధులు.
No comments:
Post a Comment