రాగభావసమన్వితమై, మధురరసపూరితమగు పాండిత్య ప్రతిభగల రచన ‘తానవర్ణం’ అనబడును. దీనిలో విశేషమైన సంగీత ప్రాముఖ్యత ఉండును.
వర్ణములు రచించుటకు అద్భుతమైన శక్తి, నైపుణ్యం అవసరం. కనుకనే, వర్ణరచయితలు బహుకొద్దిమంది మాత్రమే కలరు.
తానము అనగా స్వర ప్రస్తారము.
చతుర్విధ వర్ణములపై ఆధారపడిన అలంకారవిశేషముచేత ఈ రాగములకు ఒక రంజకమైన రూపము ఏర్పడుచున్నది.
తానవర్ణ రచనలో రాగప్రస్తారము ప్రధాన అంశము. తానము స్వరప్రస్తారమును గుర్తించుటయే కాక, మనోధర్మసంగీతములోని విభాగములలో ఒకటైన మధ్యమకాలమును కూడా గుర్తించుచున్నది.
రాగాలాపన ప్రదర్శించిన తర్వాత, ఆ రాగరూపమును మధ్యమకాల సంచారములో పాడుచూ విస్తరించుట పరిపాటి. అదియే తానము.
ఈ మధ్యమకాల నడక తానవర్ణముయొక్క ప్రత్యేక నడక. తానవర్ణములలో ప్రతియొక్క స్వరప్రస్తారము విపులముగా పాడవలెను. ఇది తానవర్ణ విశేషము.
వర్ణము అభ్యాసగాన రచనలలో చాలా ముఖ్యమైనది. ఈ రచనలు నేర్చుకొనుటయు, పరిపూర్ణపరిపక్వముతో పాడుటయు చాలా కష్టము. వర్ణమును బాగుగా నేర్చినయడల ఇతర రచనలు అతిసులభసాధ్యమగును.
వర్ణమునందుగల సాహిత్యము చాలా తక్కువగాను, అంతగా ప్రాముఖ్యత లేకయు ఉండును.
సాహిత్యము భక్తిరస ప్రధానముగా గానీ, శృంగారరస ప్రధానముగా గానీ ఉండును. దైవస్తుతి రూపముగా గానీ, ఒక రాజపోషకుని స్తుతి రూపముగా గానీ ఉండును.
ఇది ధాతుప్రధాన రచన.
సాహిత్య సారాంశము అనేక తానవర్ణములలో నాయికానాయకభావముతో కనిపించును. వర్ణమునకు రెండు భాగములున్నవి.
పూర్వాంగము
ఉత్తరాంగము
పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరము కలిసి పూర్వాంగమగును. చరణము, చరణస్వరము కలిసి ఉత్తరాంగమగును.
పూర్వాంగములోని పల్లవి అనుపల్లవులకు మాత్రమే సాహిత్యముండును. ముక్తాయిస్వరములో సాహిత్యముండదు.
ఉత్తరభాగములోని చరణమునకు ఎత్తుగడ పల్లవి, ఉపపల్లవి, చిట్టపల్లవి అని పేర్లు కలవు. ఇందు చరణమునకు సాహిత్యముండును.
సాధారణముగా మొదటి చరణస్వరము దీర్ఘముగా ఉండును. నాలుగైదు చరణస్వరములతో వర్ణము రచించుట వాడుక.
చరణస్వరమును పాడి, చరణము అందుకొనుట ఆచారము. అనుపల్లవి మాత్రమే వాగ్గేయకారుల అభిప్రాయమునుబట్టి రెండు లేక నాలుగు ఆవృత్తములుండును.
రెండవ చరణస్వరము ఒకటి లేదా రెండు ఆవృత్తములుగా ఉండును.
మూడవ స్వరము సర్వలఘుస్వరముగా ఉండును. ఇది రెండు లేక నాలుగు ఆవృత్తములుగా ఉండును.
చివరి స్వరము మిగిలిన అన్ని స్వరములకంటే కఠినశైలిలో కనబడును. విస్తారమైన ఆలాపన చేయుటకుగల ముఖ్యమైన రాగములు పంచమకాలంలో మిక్కిలి ప్రకాశించు రాగములు, భావరసప్రధానమైన రాగములు తానవర్ణ రచనకు ప్రధానమైన రాగములుగా ప్రత్యేకించబడినవి.
ఆది, ఝంపె, ఖండ అట తాళములలో తానవర్ణములు రచించవచ్చును. చాపుతాళంలో వర్ణములు రచించుట అసమంజసము.
వర్ణములు రెండు రకములు. అవి
తానవర్ణములు
పదవర్ణములు
రచయితలు:
వీణకుప్పయ్యర్
పచ్చిమిరియం ఆది అప్పయ్య
స్వాతి తిరుణాళ్ మొదలగువారు
No comments:
Post a Comment